విశాఖపట్నం : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆరోగ్యం బాగాలేదని పోలీసులకు తెలపడంతో శ్రీనివాసరావును కింగ్ జార్జ్ హాస్పిటల్కు తరలించారు. పోలీసులు అతన్ని భూజాలపై ఎత్తుకుని తీసుకువెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆస్పత్రికి తీసుకెళ్లే సందర్భంగా ‘నాకు ప్రాణహాని ఉంది సర్’.. అంటూ అక్కడ ఉన్నవారికి చెప్పడం గమనార్హం.
ఉదయం నుంచి శ్రీనివాసరావు ఆహారం తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. తన ఎడమ చేయి బాగా నొప్పిగా ఉందని, ఛాతిలో దడగా ఉందని పోలీసులకు చెప్పడంతో వైద్యులకు సమాచారం అందించారు. ఎయిర్పోర్టులోని పోలీస్ స్టేషన్కు వచ్చి పరీక్షలు చేసిన వైద్యుల సూచనల మేరకు శ్రీనివాసరావును కేజీహెచ్ హాస్పిటల్కి తరలించారు. కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తన అవయవాలను దానం చేయాలంటూ నిందితుడు సంబంధం లేకుండా మాట్లాడుతున్నట్టు సమాచారం. అసలు నీ సమస్య ఏంటి అని వైద్యులు అడిగితే.. నాకు వైద్యం కాదు.. అవయవ దానం చేయడానికి సహకరించాలంటూ వైద్యులతో చెప్పినట్టు తెలుస్తోంది.
శ్రీనివాసరావు బీపీ, పల్స్ రేట్లు సాధారణంగానే ఉన్నాయని వైద్యులు తెలిపారు. అతడి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని సిట్ అధికారులు తెలిపారు. ప్రతి 48 గంటలకు కస్టడీలో ఉన్న నిందితుడికి వైద్య పరీక్షలు చేయించాలని. అందులో భాగంగానే అతడిని ప్రైవేట్ వైద్యునితో పరీక్షించామన్నారు. కోర్టుకి వైద్య పరీక్షల నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వ కేజీహెచ్కి వైద్య పరీక్షల కోసం తరలించామని పేర్కొన్నారు. పరీక్షలు అవ్వగానే మళ్లీ పోలీస్ స్టేషన్కు తీసుకు వెళతామన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విచారణ సాఫీగా సాగుతోందని పోలీసులు తెలిపారు.