ఏలూరు: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మెహన్ రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం విజయవాడ నుంచి తుని వరకు చేపట్టిన రైలు యాత్రలో భాగంగా పవన్ ఏలూరులో కార్మికులతో మాట్లాడారు.
వైఎస్ జగన్పై దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పవన్ అన్నారు. దాడి ఘటనపై చంద్రబాబునాయుడు ప్రభుత్వం వెకిలిగా మాట్లాడటం మానుకోవాలని… లక్ష్మణ రేఖను దాటి మరి టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేశారని, అది సరికాదని పవన్ హితవు పలికారు.
తల్లి కొడుకుపై దాడి చేయిస్తుందా?
వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలే దాడి చేయించారని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యల్ని పవన్ ఖండించారు. ఎక్కడైనా తల్లి కొడుకుపై దాడి చేయిస్తుందా అంటూ నిలదీశారు. విజయమ్మ, షర్మిలలు ఇద్దరు తనను ఎన్నో తిట్టారని.. అలాగని తాను వాళ్లని ఏమీ అనలేదని పవన్ వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్పై దాడి సంఘటనను లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని, అసలు నిందితుడు శ్రీనివాసరావు కావాలనే ఆయనపై దాడి చేశాడా..? లేక ఈ దాడి వెనుక వేరెవరైనా ఉన్నారా..? ఇంకేదైనా కుట్ర దాగి ఉందా? అనే విషయాలు పోలీసులు విచారణలో తేలాల్సి ఉందన్నారు. రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపి వాస్తవాలు బయటకు తేవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉంది…
అంతేకాదు, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందని జనసేనాని వ్యాఖ్యానించారు. ప్రజాపోరాట యాత్రలో పోలీసులు తనకు రక్షణ కల్పించకపోవడంతో తాను కూడా చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. తాను ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు యాత్రలు చేస్తున్నానే తప్ప అధికారం కోసం కాదని జనసేనాని స్పష్టం చేశారు.
తాజాగా టీడీపీ, కాంగ్రెస్ల పొత్తు.. చంద్రబాబు అధికార దాహానికి నిదర్శనమని పవన్ అభిప్రాయపడ్డారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తాను టీడీపీకి మద్దతు ఇచ్చానని, అలాంటిది టీడీపీ.. కాంగ్రెస్తో ఎలా కలుస్తుందని నిలదీశారు. అసలు కాంగ్రెస్తో టీడీపీ కలవడం ఎంత వరకు సమంజసం అని పవన్ ప్రశ్నించారు.