విశాఖపట్నం: కొద్దికాలంగా ఏజెన్సీలో స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా పంజా విసిరారు. జిల్లాలోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, ఆయన ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమపై ఆదివారం కాల్పలు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీరిద్దరూ మృతి చెందారు.
2014లో తొలిసారి అరకు నియోజకవర్గం నుంచి కిడారి సర్వేశ్వరరావు వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఈయన ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.
గ్రామదర్శిని పర్యటనలో ఉండగా డుంబ్రిగూడ మండలంలోని లిప్పిట్టిపుట్టు వద్ద నక్సల్స్ అదను చూసి దెబ్బకొట్టారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. యాభై మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్న ఈ అనూహ్య దాడిలో మావోయిస్టులు విచక్షణారహితంగా వారిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
ఈ దాడిని ఎస్పీ రాహుల్ దేవ్ కూడా నిర్ధారించారు. కిడారి, సోమపై దాడి జరిగినట్లు తమకు సమాచారం అందిందని, సిబ్బందిని వెంటనే ఘటనా స్థలానికి పంపామని ఎస్పీ రాహుల్ దేవ్ తెలిపారు. గతంలో పలుసార్లు కిడారిని మావోయిస్టులు హెచ్చరించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.