విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గజ’ తుపాను వచ్చే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం చెన్నైకి 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఉన్న ఈ ‘గజ’ తుపాను నవంబరు 15న పాంబన్, కడలూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఆ సమయంలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
విశాఖపట్నంలో విరుచుకు పడుతున్న సముద్ర కెరటాలు…
‘గజ’ తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వాసులను కలవరానికి గురిచేస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్, రుషికొండలో కెరటాలు తీరంపై జోరుగా విరుచుకుపడుతున్నాయి.
వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ స్పీడ్ బోట్లను, ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కయాకింగ్ తదితర జల విన్యాసాలను ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేశారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. వేటకు వెళ్లిన వారు కూడా తిరిగి వస్తున్నారు.
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం..
దక్షిణ కోస్తా పరిధిలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలపై ‘గజ’ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అన్ని పోర్టుల్లోనూ రెండో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కేరళలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు…
ఆంధ్రప్రదేశ్తోపాటు కేరళలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ‘గజ’ తుపాను తీవ్రరూపం దాల్చి నవంబరు 13, 14 తేదీల్లో తమిళనాడు తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలియజేసింది.
తెలంగాణలోనూ ఉరుములతో కూడిన వర్షాలు…
‘గజ’ తుపాను ప్రభావంతో ఉత్తర తెలంగాణలోనూ పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నవంబరు 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నవంబరు 15న మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.