హైరదాబాద్: తెలంగాణ ఎన్నికల్లో ‘మహాకూటమి’ భాగస్వామ్య పక్షమైన సీపీఐకి.. కాంగ్రెస్తో పోత్తు కుదిరింది. తెలంగాణలో మూడు సీట్లలో పోటీ చేసేందుకు అంగీకరిస్తున్నట్లుగా సీపీఐ తెలిపింది. కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో కొత్తగూడెం స్థానం ఉండటంతో సీపీఐ నాయకులు అగ్గిమీద గుగ్గిలం అయ్యి కాంగ్రెస్ వైఖరిపై సీపీఐ రాష్ట్ర కమిటీ.. తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
చల్లారిన చిచ్చు…
ఈ క్రమంలో కాంగ్రెస్తో తాడోపేడో తేల్చుకోవాలని సీపీఐ డిసైడ్ అయ్యింది. కూటమిలో ఉండాలా? లేక బయటకు వెళ్ళాలా? అన్న దానిపై మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశం అవ్వాలని కూడా ఆ పార్టీ నాయకులు నిర్ణయించారు. అయితే కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగి కామ్రేడ్లను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ చర్చలు ఫలించి మూడు సీట్లతో పాటు రెండు ఎమ్మెల్సీ సీట్లకు సీపీఐ అంగీకారం తెలపడంతో రెండు పార్టీల మధ్య చిచ్చు చల్లారింది.
మహాకూటమి పొత్తులో భాగంగా మూడు అసెంబ్లీ సీట్లతో పాటు రెండు ఎమ్మెల్సీ సీట్లకు భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దీనిపై సీపీఐ మంగళవారం అధికారికంగా కూడా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. వైరాలో విజయ, హుస్నాబాద్లో చాడ వెంకటరెడ్డి పేర్లు ఖరారవ్వగా.. బెల్లంపల్లిలో ఎవరిని నిలపాలన్న దానిపై సీపీఐ సమాలోచనలు జరపనుంది.