
అమరావతి: చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఈ మధ్య ప్రెస్మీట్లు పెట్టకుండా కేవలం ట్విట్టర్కే పరిమితం అయ్యారు. దీని వెనుక చంద్రబాబు ఆదేశం ఉందని తెలుస్తుంది. ఎవరినైనా విమర్శించాల్సి వచ్చినా కూడా ఆయన ట్విట్టర్పైనే ఆధారపడుతున్నారు.
ట్విట్టర్లో లోకేష్ స్పందన ఇదీ అని, ట్విట్టర్ వేదికగా చెడామడా వాయించేసిన చినబాబు అనీ, ట్విట్టర్లో గట్టిగా సమాధానమిచ్చిన మంత్రిగారని.. రకరకాల టైటిల్స్తో రచ్చ చేస్తోంది టీడీపీ అనుకూల మీడియా. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో కూడా పూర్తిగా ట్విట్టర్తోనే సమాధానాలు చెబుతున్నారు లోకేష్.
లోకేష్.. ఎందుకిలా?
ఇంతకీ లోకేష్ గొంతుకేమైనా అయిందా? లేకపోతే ఆయన నోరు తెరిస్తే ప్రళయం ఏమైనా ముంచు కొస్తుందా? అర్థం కావట్లేదని తెలుగుదశం పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.
అయితే చంద్రబాబే లోకేష్ నోటికి తాళం వేశారని ఆయన సన్నిహితులంటున్నారు. అయ్యగారు జనాల్లోకి రావాలని, ఉపన్యాసాలు దంచేయాలని ఉబలాటపడిన ప్రతిసారీ ఒకడుగు ముందుకేస్తే, నాలుగడుగులు వెనక్కు పడుతోంది.
చినబాబు తెలుగు పలుకులు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్లు పడుతున్నాయి. అందుకే ఈ మధ్య ఎక్కడా నోరు చేసుకోవడం లేదు లోకేష్. ఇదీ సంగతి!








