
అమరావతి: ఓట్లు పోయినవాళ్లంతా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఓట్ల గల్లంతు వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు చంద్రబాబు.
‘ఓట్ల తొలగింపు కుట్రలో ఏ-1 నిందితుడు వైఎస్ జగన్.. ఫారమ్-7 దుర్వినియోగం చేశామని అతనే ఒప్పుకున్నాడు. దీంతో బెంగళూరు, హైదరాబాద్ నుంచే ఫారమ్ – 7 కుట్రలు జరిగాయని స్పష్టమైంది. కాబట్టి ఓట్లు పోయిన వాళ్లంతా జగన్ను నిలయదీయండి. ఓటు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోండి’ అని కోరారు.
ఇక ‘2004-09 మధ్య రౌడీయిజంతో రాష్ట్రానికి అప్రదిష్ట వచ్చింది, ఆ ఐదేళ్లలో ఫ్యాక్షనిస్టులు పేట్రేగిపోయారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశాం.. కానీ, కొందరు బాధ్యతారహితంగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. వారిని ఎలా కట్టడి చేయాలో నాకు తెలుసు’ అంటూ మరో ట్వీట్లో చంద్రబాబు వ్యాఖ్యానించారు.
‘తెలుగుదేశం అంటేనే ఉత్సాహం, ఉత్సాహం అంటేనే తెలుగుదేశం. రేపటి ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాలి, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి ఓ కొలిక్కి వచ్చి సంక్షేమం కొనసాగుతుంది. ఏమరుపాటుగా ఉంటే రాష్ట్రం దొంగలపాలవుతుంది’ అంటూ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పిలుపునిచ్చారు.
జగన్ మాయా రాజకీయం చెల్లదు..
జగన్ మాయా రాజకీయం మన రాష్ట్రంలో చెల్లదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదరాబాద్లో తమపై కేసులు పెట్టిస్తున్నారని, తమ డేటా దొంగిలించి ఓట్లు వేయాలని తమకే ఫోన్లు చేస్తున్నారని తప్పుపట్టారు. వైసీపీ నుంచి ఫోన్లు చేసేవారిని నిలదీయాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. తమ నెంబర్ ఎవరిచ్చారని వారిని ప్రశ్నించాలని సూచించారు.
ఈ మేరకు గురువారం చంద్రబాబు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో అన్నిపార్టీలకు యాప్లు ఉన్నాయని, కానీ టీడీపీ యాప్పైనే దుష్ప్రచారానికి తెగబడ్డారని దుయ్యబట్టారు. ఏపీపై వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కుట్రల మీద కుట్రలు చేస్తున్నాయని చంద్రబాబు ఆక్షేపించారు.
ఏపీలో ఓట్ల తొలగింపు వెనుక ఆ మూడు పార్టీ కుట్ర ఉందన్నారు. ఫారం-7 దుర్వినియోగం చేశానని జగనే చెప్పారని, తొలిదశలో 13లక్షల ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నారని సీఎం ఆరోపించారు. 2 వేల మంది వైసీపీ వాళ్లే 8 లక్షల దరఖాస్తులు పెట్టారని, 59 లక్షల ఓట్ల తొలగింపు సూత్రధారి జగనేనని ఆయన స్పష్టంచేశారు. సకాలంలో వేగంగా స్పందించి, ఈ కుట్రలను అడ్డుకున్నామని సీఎం తెలిపారు.








