అమరావతి: తెలంగాణలో ప్రజాకూటమి గెలుపు చారిత్రక అవసరమని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఆ పార్టీ క్యాడర్కు స్పష్టం చేశారు. బుధవారం ఉదయం పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ప్రజాకూటమి గెలుపు దేశ రాజకీయాలకే మేలుమలుపు కావాలని ఆకాంక్షించారు.
ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ నాలుగున్నరేళ్లలో అప్పుల పాలైందని, లోటు బడ్జెట్లో కూడా ఏపీ అద్భుత ప్రగతి సాధించిందని తెలిపారు. విజయనగరం ‘ధర్మపోరాటం’ విజయవంతమైనందుకు జిల్లా నేతలను అభినందించారు. మిగిలిన 3 ధర్మపోరాట సభలను కూడా విజయవంతం చేయాలని ఆదేశించారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదని, బాధ్యత తీసుకోకుండా పదవుల్లో రాణించలేరని హితభోద చేశారు.
సుజనాపై దాడులు రాజకీయ కక్షతోనే…
మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరిపై ఈడీ దాడులు రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట అని చంద్రబాబు తెలిపారు. రాజకీయ వేధింపులతో నరేంద్ర మోడీ బరితెగించారని మండిపడ్డారు. బీజేపీ నేతల వేధింపులకు భయపడేది లేదని, అన్నింటినీ సమర్ధంగా ఎదుర్కొంటామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో రైతులకు రూ.లక్షన్నర చొప్పున రుణమాఫీ చేస్తే.. తెలంగాణలో రూ.లక్ష మాత్రమే జరిగిందని ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. తెలంగాణలో డ్వాక్రా మహిళలకు రూపాయి కూడా ఇవ్వలేదని.. ఏపీలో ప్రతి డ్వాక్రా మహిళకూ రూ.10 వేలు లబ్ధి చేకూరిందని వెల్లడించారు. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 10 లక్షల మందికి ఉపాధి లభిస్తే.. తెలంగాణలో అందులో సగం కూడా జరగలేదన్నారు.
ప్రభుత్వ భరోసాతో ఏపీలో రైతు ఆత్మహత్యలు ఆగితే.. తెలంగాణలో 5 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో తెలుగుదేశం కార్యకర్తలు సమర్థంగా పనిచేయాలని, ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. ముస్లిం మైనారిటీల్లో సాధించిన పట్టును నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు.
‘ప్రజలకు సేవ చేయాలి.. పార్టీలో చురుగ్గా ఉండాలి’ అనేది తెలుగుదేశం తారకమంత్రమని చెప్పారు. ప్రతి చోటా ప్రజల్లో ఉత్సాహం ఉందని.. పార్టీ నాయకుల్లో అలసత్వం సహించబోనని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా రూపొందాలని.. డిసెంబర్ 30న రాజమహేంద్రవరంలో ‘బీసీ జయహో’ భారీ సభను విజయవంతం చేయాలని కోరారు.