అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ ఖాయమైంది. ఆదివారం ఉదయం 11.45 నిమిషాలకు కేబినెట్ విస్తరణకు ముహూర్తం నిర్ణయించారు. మంత్రివర్గంలో మైనార్టీలకు, గిరిజనులకు అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరగడంతో.. ఆయా వర్గాలకు చెందిన, పదవులు ఆశించిన నాయకులంతా అమరావతికి బయలుదేరి వెళ్లారు.
ముఖ్యంగా మైనార్టీ నేతలు.. శనివారం చంద్రబాబు నివాసానికి వెళ్లి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నారు. అయితే అప్పటికే సీఎం పదవులు ఖరారు చేసేశారు. మంత్రి పదవి శాసనమండలి ఛైర్మన్ ఎన్ఎండీ ఫరూఖ్కు ఖాయం కావడంతో.. ఇతర నేతలు కాస్త అసంతృప్తికి గురయ్యారు. దీంతో చంద్రబాబు మైనార్టీ నేతల్ని పిలిచి మాట్లాడారు.
మారిన రాజకీయ పరిస్థితులు, కేబినెట్ విస్తరణ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఖాళీగా ఉన్న పదవుల్లో మైనార్టీలకు పెద్ద పీట వేశారు.
మంత్రివర్గంలో ఛాన్స్ రావడంతో.. మండలి ఛైరన్మన్ పదవికి ఫరూఖ్ రాజీనామా చేశారు. అయితే ఈ పదవిని మళ్లీ మైనార్టీలకే కేటాయించారు. ఎమ్మెల్సీ షరీఫ్కు శాసనమండలి ఛైర్మన్గా అవకాశం కల్పించారు. అలాగే అసెంబ్లీలో ప్రభుత్వ విప్ పదవిలో అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఎమ్మెల్యే చాంద్పాషాను నియమించాలని నిర్ణయించారు.
ఇలా మంత్రి పదవి ఆశించిన నేతలకు.. మండలి ఛైర్మన్, విప్ పదవులతో సీఎం చంద్రబాబు సర్థుబాటు చేశారు. అంతేకాకుండా, పదవులు ఆశించి నిరాశకు గురైన ముస్లిం ఎమ్మెల్యేలకు భవిష్యత్తులో అవకాశం ఇస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటానికి మద్దతుగా ముస్లింలను సమీకరించుకొని వెళ్లాలని మైనార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.