అమరావతి: విశాఖలో భూ రికార్డుల ట్యాంపరింగ్ చోటు చేసుకొన్నట్టుగా సిట్ నివేదిక వెల్లడించింది. సిట్ నివేదికలో గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పని చేసి… ప్రస్తుతం విపక్ష పార్టీలో ఉన్న కీలకనేత పేరును సిట్ ప్రస్తావించినట్టు సమాచారం.
విశాఖలో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అయిన విషయం 2017 జూన్ నెలలలో వెలుగులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. సిట్ దాదాపు 6 నెలల పాటు పలువురిని విచారించింది.
సిట్కు భూముల రికార్డులకు సంబంధించిన విషయమై దాదాపు 3 వేలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటిని సిట్ విచారించి సుమారుగా 15 ఏళ్ల నుండి విశాఖలో భూ రికార్డుల విషయాలన్నింటిని దర్యాప్తు చేసింది.
ఈ దర్యాప్తులో విశాఖపట్టణంలో భూ రికార్డులు ట్యాంపరింగ్కు గురైనట్టుగా తెలిందని సిట్ నివేదిక వెల్లడించింది. సిట్ నివేదికలో 300 మంది పేర్లను ప్రస్తావించినట్టు సమాచారం. ఈ రికార్డుల ట్యాంపరింగ్ జరిగిన సమయంలో ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్ కలెక్టర్లు, 10 మంది డీఆర్ఓలు పని చేసి నట్లు తెలుస్తోంది.
కేబినెట్ ఆమోదముద్ర…
ఈ మేరకు సిట్ నివేదికకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది. అంతేకాదు, ఈ సిట్ నివేదికను ఆమోదించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకొనేందుకు వీలుగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది.