తిరువనంతపురం: వెస్టిండీస్తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను భారత్ సొంతం చేసుకుంది. గురువారం ఇక్కడి గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. తద్వారా సిరీస్ను 3-1తో చేజిక్కించుకుంది.
చివరి వన్డేలో వెస్టిండీస్ నిర్దేశించిన 105 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలోనే.. అంటే మరో 211 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది.
రోహిత్ శర్మ 56 బంతుల్లో 63 నాటౌట్ (4×5, 6x 4), విరాట్ కోహ్లి 29 బంతుల్లో 33 నాటౌట్ (4×6) ఇద్దరు మరోసారి ఆకట్టుకున్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్ 29 బంతుల్లో 6 పరుగులే చేసి తొందరగా పెవిలియన్ చేరినప్పటికీ రోహిత్-కోహ్లీల జోడి ఇంకో వికెట్ పడకుండా జాగ్రత ఆడి భారత్కు విజయాన్ని అందించింది.
భారత బౌలర్ల దెబ్బకు కుప్పకులిన వెస్టిండీస్….
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు ఎంచుకున్న వెస్టిండీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. విండీస్ ఓపెనర్ కీరన్ పావెల్ డకౌట్గా పెవిలియన్ చేరగా, ఫస్ట్ డౌన్ ఆటగాడు సాయ్ హోప్ సైతం పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. భారత బౌలర్ల దెబ్బకు 31.5 ఓవర్లలో కేవలం 104 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్లు మరోసారి చెలరేగి వెస్టిండీస్ను అత్యల్ప స్కోరుకే పరిమితం చేశారు.
రోవ్మాన్ పావెల్ 39 బంతుల్లో 16, మార్లోన్ శామ్యూల్స్ 38 బంతుల్లో 24, జాసన్ హోల్డర్ 33 బంతుల్లో 25 పరుగులు మినహా ఎవరూ రెండంకెల స్కోరును దాటలేకపోయారు. ఆపై రోవ్మాన్ పావెల్-శామ్యూల్స్ల జోడి వెస్టిండీస్ ఇన్నింగ్కి మరమ్మత్తులు చేపట్టింది.
అయితే శామ్యూల్స్ మూడో వికెట్గా ఔట్ కావడంతో విండీస్ మరోసారి కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 53 పరుగుల వద్ద హెట్మెయిర్ నిష్క్రమించిన తర్వాత రోవ్మాన్ పావెల్, ఫాబియన్ అలెన్, హోల్డర్లు స్వల్ప విరామాల్లో పెవిలియన్ చేరడంతో విండీస్ వంద పరుగుల్ని అతికష్టం మీద చేరింది
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తాచాటగా, ఖలీల్ అహ్మద్, బూమ్రాలు తలో రెండెసి వికెట్లతో మెరిశారు. భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్లకు చెరో వికెట్ దక్కింది. ఆఖరి వన్డేలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రవీంద్ర జడేజాను వరించింది.