

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. టిట్లీ తుపాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలియవచ్చింది.
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని వివరించడానికి గవర్నర్ను పవన్ అపాయింట్మెంట్ కోరారు. దీంతో నరసింహన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో గవర్నర్ను కలిసిన పవన్.. తుపాన్ నష్టంపై నివేదికను సమర్పించడంతోపాటు ప్రభుత్వం వైఫల్యాలపై కూడా పిర్యాదు చేశారు. అంతకుముందు టిట్లీ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పవన్ బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన సంగతి తెలిసిందే.
మరోవైపు టిట్లీ తుపాన్ బాధితులకు సహాయం అందించడంలో కేంద్రం విఫలమైందని తెలుగుదేశం పార్టీ పదే పదే విమర్శిస్తూ వస్తోంది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ ఆలస్యంగా పర్యటించారని, ఆయనది దొంగ ప్రేమ అని కూడా టీడీపీ నాయకులు కొందరు విమర్శించారు. పవన్ కళ్యాణ్ కూడా ఇందుకు ధీటుగా తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించారు.
చంద్రబాబునాయుడు బాగా పని చేసి కేంద్ర ప్రభుత్వన్ని కోరితే సాయం ఇచ్చేది కాదా అని పవన్ వ్యాఖ్యానించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ పునరుద్ధరణ జరగలేదని, సాయంపై అందరూ తలోమాట మాట్లాడుతున్నారని అన్నారు. క్షేత్రస్థాయిలో అందరూ విమర్శిస్తుంటే.. టిట్లీ తుపాన్ సహాయక చర్యలపై చంద్రబాబు ప్రభుత్వం కృషి భేష్ అంటూ గవర్నర్ నరసింహన్ మెచ్చుకోవడాన్ని పవన్ కల్యాణ్ ఆక్షేపించారు.








