హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి కొణిదెల చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారా.. అనే చర్చ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తదనంతరం కాంగ్రెస్లో విలీనం చేసిన చిరంజీవి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నేతగానే కొనసాగుతున్నారు. ఆయన రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్నకొన్ని పరిణామాలు, ఆంధ్రలో ఆ పార్టీకి జీవం పోవడం, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం..ఇలాంటివెన్నో కారణాలతో ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.
ఈ పరిస్థితుల్లో ఇటీవలే చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగిసింది.. దాన్ని ఆయన ఇక పునరుద్ధరించుకోలేదు. ఈ సంకేతాలను బట్టి ఆయన ఆ పార్టీకి దూరమైనట్లుగా పలువురు పేర్కొంటున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల చిరంజీవిని రాహుల్గాంధీ కోరినట్లు తెలిసింది. ఆంధ్రాలో పరిస్థితులు కాంగ్రెస్ కి అంత అనుకూలంగా లేకపోవడంతో.. ఆయన వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు మాత్రం చిరంజీవి కాంగ్రెస్ కి శాశ్వతంగా దూరమైనట్లుగా పేర్కొంటున్నారు. అయితే ఇంతవరకు ఆయన మాత్రం తన మనోభావాన్ని ఎక్కడా వ్యక్తం చేయలేదు. ఇప్పుడందరూ ఆయన స్పందన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇవన్నీ ఒకవైపు ఉంటే.. చిరంజీవి రాజకీయాల మీద కంటే సినిమాలపై నే ఎక్కువ దృష్టి పెట్టారు… ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ బయోపిక్లో ఆయన నటిస్తూ బిజీగా ఉన్నారు. సైరా తర్వాత చిరంజీవి మరిన్ని సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.