హైదరాబాద్: గురువారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కేసీఆర్ తనయ కవిత ఓటమి పాలైన విషయం తెలిసిందే. తన సమీప బీజేపీ అభ్యర్ధి ధర్మపురి సంజయ్ చేతిలో ఓటమి చవి చూశారు.
ఈ క్రమంలోనే కవిత ఓటమితో టీఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడిపోయారు. కవిత ఓటమికి కారణలపైనా వాళ్ళు విశ్లేషించుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కవిత ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి చేపట్టవచ్చని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ అన్నారు.
పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఉంటే ఆమె ఓటమిపాలయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా కవిత తిరిగి ఎమ్మెల్సీ అయి మంత్రిగా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
ఇక కవిత ఓటమిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి స్పందించారు. కవిత ఓటమికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కారణమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అలాగే ఆ పార్టీ ఎమ్మెల్యేలపై కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వాళ్లే సరిగ్గా ఉండి ఉంటే కవితకు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదన్నారు.