తెలంగాణ ఎన్నికలు 2018: నోటిఫికేషన్ విడుదల.. 19 వరకు నామినేషన్లకు గడువు, 20న పరిశీలన, 22 వరకు ఉపసంహరణ

- Advertisement -

telangana-map-ec-building

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం (నవంబరు 12) విడుదలైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ నోటిఫికేషన్ గెజిట్‌ను జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం నోటిఫికేషన్‌ జారీ అయిన మరుక్షణం నుంచే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.

నోటిఫికేషన్‌ ప్రకారం.. అభ్యర్ధులు నవంబరు 19 వరకు తమ నామినేషన్ దాఖలు చేయవచ్చు. నవంబరు 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.  అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22 వరకు గడువు ఉంది. ఇక డిసెంబర్‌ 7న తెలంగాణలో పోలింగ్‌ జరగనుంది.  11న ఓట్ల లెక్కింపు జరుగుతుంది..  13వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

ఇదీ ఎన్నికల షెడ్యూల్..

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది.  అధికార టీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇదివరకే ప్రకటించిన 107 మంది అభ్యర్థులకు ఆదివారమే  బి-ఫారాలను కూడా అందజేసింది. మరోవైపు ‘మహాకూటమి’ సీట్ల పంపకం ఇప్పటివరకు కొలిక్కిరాలేదు. సోమవారం సాయంత్రానికి దీనిపై మరింత స్పష్టత  వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నామినేషన్ పత్రాల సమర్పణ, నిబంధనల వివరాలు.. 

* ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో పాటు రూ.10 వేలు నామినేషన్ డిపాజిట్ కింద చెల్లించాలి.

* ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయితే ఈ నామినేషన్ డిపాజిట్ రూ. 5వేలు, అయితే తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

* కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఫారం-26 నోటరైజ్డ్ అఫిడవిట్‌‌లో అన్ని కాలమ్స్‌ను ఎమ్మెల్యే అభ్యర్థులు నింపాల్సి ఉంటుంది.

* నామినేషన్ వేసే అభ్యర్థి నామినేషన్‌ దాఖలుకు 48 గంటల ముందే ఏదైనా జాతీయ బ్యాంక్‌లో తన పేరిట ప్రత్యేకమైన ఖాతాను తెరవాల్సి ఉంటుంది.

* ఎన్నికల వ్యయం మొత్తాన్ని అభ్యర్థులు ఈ ఖాతాల నుంచే నిర్వహించాలి. నామినేషన్ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల్లో చిత్రీకరిస్తారు.

* అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేయడానికి ‘ఫారం-2బి’ సంబంధిత రిటర్నింగ్ అధికారి నుంచి ఉచితంగా పొందవచ్చు. ఒక్కో అభ్యర్థి 4 నామినేషన్ పత్రాలు దాఖలు చేసే వెసులుబాటు ఉంటుంది.

* గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థిని.. అతడు లేదా ఆమె పోటీ చేసే నియోజకవర్గ పరిధిలోని ఒక్క ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. రిజిస్టర్ పార్టీ లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అభ్యర్థిని మాత్రం నియోజకవర్గం పరిధిలోని 10 మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది.

* ప్రతిపాదించే ఓటరు నిరక్షరాస్యులైతే నామినేషన్ పత్రంలో వేలి ముద్రవేస్తే రిటర్నింగ్ అధికారి ముందు కూడా వేలి ముద్ర వేయాల్సి ఉంటుంది.

* గుర్తింపు లేని పార్టీలు, ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు నామినేషన్ పత్రంలోని ‘ఫారం-2బి’ పార్ట్ 3లోని ‘సి’ కాలమ్ ఎదురుగానున్న గుర్తులను మూడింటిని ప్రాధాన్యతా క్రమంలో రాయాల్సి ఉంటుంది.

* పోటీ చేసే అభ్యర్థి నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థి కానట్లయితే అతడు నమోదైన నియోజకవర్గంలోని ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి నుంచి ఓటరు జాబితా సర్టిఫైడ్ ప్రతిని తీసుకు వచ్చి నామినేషన్‌తోపాటు సమర్పించాల్సి ఉంటుంది.

* గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఫారం-ఎ, ఫారం-బి పత్రాలను నవంబరు 19న మధ్యాహ్నం 3 గంటల్లోపు రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి.

* అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలను, క్రిమినల్ కేసుల వివరాలను తప్పని సరిగా నామినేషన్ పత్రాల్లో పేర్కొనాలి.

* అభ్యర్థులు విద్యుత్, మునిసిపాలిటీ, గ్రామ పంచాయతీ, ప్రభుత్వం కేటాయించిన వసతి గృహాలకు గత పది సంవత్సరాల నుంచి ఎటువంటి బకాయిలు లేనట్లు ధ్రువపత్రం కూడా జత చేయాలి.

- Advertisement -