హైదరాబాద్: ప్రస్తుతం మండుటెండల్లో తెలంగాణ వాసులకు ఇదొక చల్లని కబురు. వచ్చే రెండు రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
మంగళ, బుధవారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా.
అంతేకాదు, కొన్ని జిల్లాల్లో అయితే పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ పేర్కొంది.
మరోవైపు సోమవారం రాష్ట్రంలోని సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది.
ఇక రాజధాని నగరం హైదరాబాద్లో అయితే వచ్చే రెండు రోజుల్లో సాయంత్రం లేదా రాత్రిపూట ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని తెలుస్తోంది.
రాబోయే రెండు రోజులు గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు మరియు 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల అంచనా.