హైదరాబాద్: సాంకేతిక లోపం కారణంగా శనివారం మియాపూర్-అమీర్పేట్ మార్గంలో ప్రయాణిస్తోన్న మెట్రో రైలు అకస్మాత్తుగా బాలానగర్ స్టేషన్లో నిలిచిపోయింది. ఫలితంగా ఇతర మెట్రో రైళ్లకు కూడా అంతరాయం కలిగింది. దీంతో ఆయా రైళ్లలోని ప్రయాణికులు, స్టేషన్లలో రైళ్ల కోసం ఎదురుచూస్తోన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఆయా మెట్రో స్టేషన్లలోని సిబ్బంది ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పకుండా టికెట్లు ఇచ్చి ప్లాట్ఫాం మీదకు పంపడంతో.. ఎంతసేపు వేచి చూసినా రైళ్లు రాకపోవడం, దీనికితోడు మెట్రో సిబ్బంది అసలేం జరిగిందో వివరించకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తమ డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ లైన్లలో సాంకేతిక లోపం…
విద్యుత్ లైన్లలో సాంకేతిక లోపం ఏర్పడటం వల్లే మెట్రో సర్వీసులు ఆగిపోయినట్లు తెలుస్తోంది. మళ్లీ ఎప్పుడు రైళ్లను పునరుద్ధరిస్తారన్న విషయమై మెట్రో అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో తమ డబ్బులు వెనక్కు ఇచ్చేయాలని పలువురు ప్రయాణికులు మెట్రో కౌంటర్లలో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తాము గంట నుంచి వేచి చూస్తున్నా రైలు రాకపోవడం ఏమిటంటూ ఆయా స్టేషన్లలో ప్రయాణికులు సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలో, శివారు ప్రాంతాల్లో ఉద్యోగులు, విద్యార్థులు మెట్రో రైళ్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. తాజాగా అమీర్ పేట-మియాపూర్ మార్గంలో మెట్రో సేవలు నిలిచిపోవడంతో వీరంతా సకాలంలో గమ్యస్థానం చేరుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఉన్నట్లుండి మెట్రో మార్గంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో మిగతా మార్గాల్లోని మెట్రో సేవలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. సమస్య ఎప్పటికి తీరుతుందనే దానిపై వారు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.