హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర రావు గురువారం మధ్యాహ్నం రాజ్భవన్లో ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా.. అతి సాధారణంగా ప్రమాణ స్వీకారం చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికల అనంతరం దేశరాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానన్న కేసీఆర్.. ప్రమాణస్వీకారంతోనే కార్యచరణ మొదలు పెట్టాలని తొలుత భావించారు. కానీ పలు రాష్ట్రాల్లో కొత్తగా ప్రభుత్వాలు ఏర్పాటు కానుండటం.. సన్నిహిత నేతలు తమ పనుల్లో బిజీగా ఉండటంతో తన నిర్ణయం వాయిదా వేసుకున్నట్లు సమాచారం.
కాసింత సమయం తీసుకుని…
ఇప్పటికే పార్టీ అంతర్గత సమావేశంలో ఈ విషయాలపై కేసీఆర్ కూలంకషంగా చర్చంచినట్లు విశ్వసనీయ సమాచారం. తొలుత పదవీ ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేసి… అనంతరం మరో భారీ వేదికతో కాంగ్రెస్, బీజేపీయేతర శక్తులను కూడగట్టాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ రోజు రాజ్భవన్లో కేసీఆర్ ప్రమాణస్వీకారానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారని, ఈ మేరకు గవర్నర్ కార్యాలయానికి అనధికార సమాచారం అందినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం కేసీఆర్ .. గవర్నర్ నరసింహన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు.