
- Advertisement -
అమరావతి: మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయేకి పూర్తిస్థాయి మెజారిటీ రానిపక్షంలో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలను యూపీఏ ముమ్మరం చేసింది. ఈనెల 23న ఎన్నికల ఫలితాల రోజు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ విపక్షాలతో భేటీకి పిలుపునిచ్చారు.
అయితే సోనియాగాంధీతో భేటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ వచ్చినా భేటీకి వెళ్లడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా స్పష్టం చేశారు.
అయితే, జగన్ను కాంగ్రెస్ వైపు తీసుకొచ్చే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ ఓ ముఖ్యనేతకు అప్పగించినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.
చదవండి: సీఈసీ చూపిన ఆధారాలతో దిక్కుతోచని స్థితి లో బాబు!
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత యూపీఏకి ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరమైతే వైసీపీని.. యూపీఏ వైపు తీసుకొచ్చే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్కు అప్పగించినట్టు తెలిసింది. కమల్ నాథ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల్లో ఒకరు. పార్టీ సీనియర్. ఓ రకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కూడా సన్నిహిత సంబంధాలున్న నేత.
2004 నుంచి 2009 మధ్య రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కమల్ నాథ్ కేంద్ర వాణిజ్యశాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కమల్ నాథ్ పని ప్రారంభించారని, ఓ వైసీపీ ముఖ్యనేతకు ఫోన్ చేసినట్టు కూడా సమాచారం. యూపీఏలోకి పార్టీలను తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వెళ్తోంది.
గతంలో చంద్రబాబు నాయుడును హ్యాండిల్ చేయడానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను పంపించింది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని ఆకర్షించేందుకు మరో సీఎంను రంగంలోకి దింపింది.
- Advertisement -








