నాడు వై ఎస్ పేదలకోసం ఒక అడుగు ముందుకేస్తే….నేడు జగన్ పేదలకోసం రెండడుగులు ముందుకేసాడు….

YS Rajasekhar Reddy News, YS Jagan News, AP political News, Newsxpressonline
- Advertisement -
 
అమరావతి: మేకతోటి సుచరిత.. ఏపీలో ఇప్పుడీ పేరు ఒక సంచలనం. మంత్రుత్వ శాఖలలోనే   అత్యంత కీలకమైన హోంశాఖను సుచరితకు కట్టబెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే సీఎం జగన్ నడిచారు. 2009లో చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డికి అప్పటి సీఎం వైఎస్ హోంమంత్రి  పదవి ఇచ్చారు.
 
ఏపీ తొలి మహిళా హోంమంత్రిగా  ఆమె బాధ్యతలు  నిర్వర్తించి, రికార్డ్ సృష్టించింది. ఇక తాజాగా జగన్ సైతం మహిళా నేతకే రాష్ట్ర శాంతిభద్రతల నిర్వహణను అప్పగించారు. మేకతోటి సుచరితను హోంమంత్రిని చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనితో  నవ్యాంధ్ర తొలి మహిళా హోమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు మేకతోటి సుచరిత.
 
దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అవకాశం ఇస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న వైయస్ జగన్ హోంశాఖను మహిళా ఎమ్మెల్యేకు కట్టబెట్టడం మరో సంచలనంగా చెప్పుకోవచ్చు. 
ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రస్తుత వయస్సు  41 ఏళ్ళు. ఈమె  స్వస్థలం ఫిరంగిపురం. ఆమె భర్త దయాసాగర్. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సుచరిత బీఏలో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసారు.  ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్సార్ స్ఫూర్తితోనే  మేకతోటి సుచరిత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వై ఎస్ హయాంలో  కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేశారు.
 
2006లో కాంగ్రెస్ పార్టీ తరపున ఫిరంగిపురం జెడ్పీటీసీగా ఎన్నికైయ్యారు . అనంతరం 2009లో పత్తిపాడు  ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు అవకాశమిచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి 2,500 మెజార్టీతో గెలిచారు. వైఎస్ మరణం తర్వాత 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసి జగన్ వెంటనడిచారు.
 
 
అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో 16వేల మెజార్టీతో విజయం సాధించారు సుచరిత. ఇక 2014 ఎన్నికల్లో అప్పటి టీడీపీ నేత రావెల కిశోర్ బాబు చేతిలో ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సుచరిత మంచి పేరును సంపాదించుకుంది. పత్తిపాడు ప్రజాసమస్యలపై పోరాడుతూ వాటి పరిష్కారానికి కృషి చేశారు.
 
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పత్తిపాడు నుండే మళ్ళీ పోటీచేసి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్యప్రసాద్‌పై 7,398 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం వైఎస్ జగన్ కేబినెట్‌లో ఎస్సీ కోటాలో ఆమెకు మంత్రి పదవి దక్కింది. అంతేకాదు ఏకంగా హోంమంత్రి పదవిని దక్కించుకొని సంచలనంగా మారారు.
 
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపట్ల విధేయత, వైయస్ జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉండటం వంటి పరిణామాలు ఆమెకు కలిసొచ్చిందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ నవ్యాంధ్రప్రదేశ్ లో తొలి మహిళా హోంశాఖ మంత్రిగా రికార్డు సృష్టించబోతున్నారు మేకతోటి సుచరిత.
 
- Advertisement -