అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్తో కలిసేందుకు తెలంగాణలో కేసీఆర్, ఏపీ నుంచి జగన్ మోహన్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ కీలక నేత , ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సంచలన ప్రకటన చేశారు.
కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు తమకి ఎలాంటి పిలుపు రాలేదని ప్రకటించారు. ఒకవేళ పిలుపు వచ్చినా వెళ్లేది లేదని కూడా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తేల్చి చెప్పారు. మే 23న ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో పార్టీ తరఫున పోలింగ్ ఏజెంట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడారు.
చదవండి: ఏపీలో ఫ్యాను జోరు ఖాయం! లక్ష్మీపార్వతి జోస్యం!
కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రానికి సంబంధించి డిమాండ్లకు ఓకే చెప్పిన పార్టీకే తాము మద్దతిస్తామని గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ పార్టీని క్షమించానని జగన్ తెలిపారు. అలాగే, కాంగ్రెస్తో తనకు ఎలాంటి శతృత్వం లేదని స్పష్టం చేశారు. ఓ రకంగా కాంగ్రెస్ పార్టీకి కూడా తాము మద్దతివ్వడానికి ఎలాంటి ఆటంకాలు లేవని క్లారిటీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ గెలుస్తుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎంపీ సీట్లు కూడా మెజారిటీ స్థానాలు దక్కించుకుంటుందంటూ వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డికి సలహాలు ఇస్తూ వస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్, ఫెడరల్ ఫ్రంట్ టూర్లు వేశారు.
ఓ రకంగా కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు కూడా సిద్ధమంటూ సంకేతాలు పంపారు. ఆ రకంగా కేసీఆర్ వెనుకే జగన్ కూడా వెళతారని అంతా భావించారు. తాజాగా వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చేది లేదంటూ ప్రకటించడం పెను సంచలనంగా మారింది.








