

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత వేం నరేందర్రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు గచ్చిబౌలి రోలింగ్హిల్స్లోని ఆయన ఇంటికి వెళ్లి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
అంతేగాక, వారం రోజుల్లో ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీచేశారు. కాగా 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు నోటు’ కేసులో వేం నరేందర్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి.
ఆ సమయంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
కాగా, ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా, ఓటుకు నోటు కేసు విచారణ జరుగుతూనే ఉంది.








