తిరుమల: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం తరువాత భక్తులు అపురూపంగా భావించే లడ్డూ ప్రసాదానికి విశిష్ట స్థానం ఉంది. ఎవరైనా తిరుమలకు వెళ్తే తప్పనిసరిగా ముందుగా లడ్డు గురించే అడుగుతారు. తాజాగా శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని టీటీడీ దేవస్ధానం రికార్డు స్థాయిలో తయారు చేసి భక్తులకు విక్రయించింది.
తమిళులు ఎంతో పవిత్రంగా భావించే పెరటాని మాసంలో పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులందరికీ సంతృప్తికరంగా శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి ఇబ్బంది కలగకుండా లడ్డు ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. ఈ క్రమంలో ఈ సెప్టెంబరు 30న టీటీడీ చరిత్రలో తొలిసారిగా 5,13,566 లడ్డూలను తయారు చేసి విక్రయించారు.
రికార్డు స్థాయిలో తయారీ, విక్రయాలు…
గతంలో 2016 అక్టోబరు 10న 4,64,152 లడ్డూలు విక్రయిస్తే, 2017 మే 28న 4,32,745 లడ్డూలు, 2018 మే 19న 4,14,987 లడ్డూలు, 2017 జూన్ 11న 4,11,943, లడ్డూలను టీటీడీ విక్రయించింది. ఇప్పటి వరకూ ఉన్నవిక్రయ రికార్డులను సెప్టెంబరు 30న జరిగిన విక్రయాలు అధిగమించాయి. అధికారులు, సిబ్బంది, పోటు కార్మికులు కలిసి సమిష్టిగా కృషి చేసి భక్తులకు అవసరమైనన్ని లడ్డూలను తయారు చేస్తూన్నారు. అలా తయారు చేసిన లడ్డులను 64 కౌంటర్ల ద్వారా భక్తులకు విక్రయిస్తున్నారు.
ఒక్క ఆదివారం నాడు 1,05,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ ఆది, సోమవారాల్లో దాదాపు 1.8 లక్షల మంది వరకు భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి తమిళులు పెద్ద సంఖ్యలో రావడంతో క్యూ కాంప్లెక్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. సర్వ దర్శనానికి దాదాపు 20 గంటలపైనే పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.