

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా యారాడ సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది. యారాడ బీచ్ వద్ద సముద్ర స్నానానికి వచ్చిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. వీరంతా విహారయాత్ర కోసం వచ్చినట్లు తెలుస్తోంది.
మెుత్తం 12 మంది సముద్రంలో స్నానం కోసం దిగగా, వారంతా అలల్లో కొట్టుకుపోతుండగా స్థానికులు చూశారు. అయితే జాలర్లు, కోస్ట్ గార్డ్స్ సిబ్బంది పలువురిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. ఆ తర్వాత అధికారులకు సమాచారం అందించారు.
12 మందిలో ఏడుగురు గల్లంతవగా.. వారిలో ఒకరిని కోస్టు గార్డులు రక్షించారు. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
విహార యాత్రకు వచ్చిన వారంతా విశాఖ హౌసింగ్ బోర్డు, కేఆర్ఎం కాలనీకి చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. గల్లంతైన వారిని తిరుపతి, దుర్గ, వాసు, గణేశ్, రాజేశ్, శ్రీనులుగా గుర్తించారు. చీకటి పడుతుండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు.








