
విజయవాడ: హిందూ సమాజం ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే తిరుమల శ్రీవారి పవిత్ర గోవింద నామాలను, భక్తి గీతాలను రాజకీయ ప్రయోజనాల కోసం పేరడీలుగా మార్చడంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
నెల్లూరులో వైసీపీ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో శ్రీవారి నామాలను అపహాస్యం చేస్తూ ఆ పార్టీ నేతలు ప్రవర్తించిన తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన అధికారిక సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది.
రాజకీయాల్లో కనీస ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ, తమ రాజకీయ లబ్ధి కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తోందని పవన్ కల్యాణ్ విమర్శించారు. నెల్లూరు ఘటనలో పాల్గొన్న నేతల వైఖరి ధార్మిక విశ్వాసాలకు తీవ్ర విఘాతం కలిగించేలా ఉందన్నారు.
సమాజంలో మత విద్వేషాలను రగల్చేలా కుట్రపూరితంగా వ్యవహరించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. కోట్ల మంది భక్తుల నమ్మకాలతో ఆటలాడుకోవడాన్ని ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.








