

అమరావతి: జనసేన వామపక్ష పార్టీలతో తప్ప మరే ఇతర పార్టీతో కలిసి వెళ్లదని, వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో జనసేన తరుపున అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు.
యువత, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, త్తులపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మాటలను నమ్మరాదని పార్టీ శ్రేణులకు సూచించారు. అంతేకాదు, ఈ పార్టీలు చేస్తున్న తప్పుడు వ్యాఖ్యలు, ప్రచారాన్ని జనసైనికులు ముక్తకంఠంతో ఖండించాలని కోరారు.
క్లారిటీ ఇచ్చిన పవన్…
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, తమతో కలసి జనసేన పోటీ చేస్తే జగన్కు నొప్పేంటి? అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. జనసేన మళ్లీ టీడీపీతో చేతులు కలపబోతోందా? అనే అనుమానాలు కూడా పలువురిలో కలిగాయి. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తమ భవిష్యత్ కార్యాచరణపై కొంత క్లారిటీ ఇచ్చారు.
జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఏమన్నారంటే…
వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందంటూ కొద్ది రోజులుగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ తమతో కలిస్తే ఆయనకొచ్చే బాధేంటని వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్తో కలవడానికి తాము సిద్ధమే అన్నట్లు సూచన ప్రాయంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై జనసేనాని స్పందించలేదంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై జనసేన అధినేత గురువారం స్పందిస్తూ.. జనసేన వామపక్షాలతో తప్ప ఎవరితోనూ కలవదంటూ కుండబద్దలు కొట్టేశారు.
అంతేకాదు, జనసేన పార్టీ కేవలం ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రమే ఆవిర్భవించలేదని పేర్కొన్నారు. పాతిక తరాల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కోసం పోరాటం చేయడానికి, వారికి మెరుగైన జీవన విధానాన్ని కల్పించడానికి జనసేన వచ్చిందన్నారు. యువత ఆశయాలను, ఆడపడుచుల ఆకాంక్షలను అర్థం చేసుకుని తాము ముందుకు వెళ్తున్నామని పవన్ చెప్పారు.
ఒక్క వామపక్షాలతోనే తప్ప…
‘‘2014లో కొన్ని పార్టీలకు మద్దతిచ్చాం. తెలుగు ప్రజల సుస్థిరత కోసం ఆ రోజున ఆ పార్టీలకు మద్దతివ్వాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజు జనసేన పార్టీ సమతుల్యత కోసం 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నాం. మేం కలుపుకునేది కూడా ఒక్క వామపక్షాలనే తప్ప ఇంకే అధికార పక్షంతో గానీ, ప్రతిపక్షంతో గానీ కలిసే అవకాశాలు లేవు. కానీ, జనసే పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టే విధంగా అధికార పక్షం, ప్రతిపక్షం ప్రవర్తిస్తున్నాయి. జనసేన పార్టీ మద్దతుదారులు ప్రతి ఒక్కరికీ నేను చెప్పేది ఒక్కటే.. జనసేన పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తుంది..’ అంటూ పవన్ క్లారిటీ ఇచ్చేశారు.
JanaSena Party to contest in 175 constituencies – JanaSena Chief @PawanKalyan #JSPToContestIn175Constituencies https://t.co/19bdkzHIxj
— JanaSena Party (@JanaSenaParty) January 3, 2019
జనసేన పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం. వామపక్షాలు తప్ప ఎవరితో కలిసి వెళ్ళము. యువతకు , మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తాం. దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు. ముక్తకంఠంతో ఖండించండి – @PawanKalyan #JSPToContestIn175Constituencies
— JanaSena Party (@JanaSenaParty) January 3, 2019








