
విశాఖపట్నం: ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి విశాఖపట్నానికి వెళ్ళిన ఆయనకు పార్టీ నేతలు సన్మాన సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. టీడీపీ హయాంలో అవినీతి పెచ్చరిల్లిపోయిందని, తాను ఎంపీగా ఉన్నప్పుడే పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరు రూ.50 కోట్లు నుంచి రూ.500 కోట్లు వరకూ అవినీతి చేశారని చెప్పారు. వాటిని ఆధారాలతో సహా చంద్రబాబునాయుడుకి అందజేస్తే… తాను లేస్తే మనిషిని కాదన్నట్టు… వారికి ఎవరికీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని చెప్పి మాట దాటేసేశారన్నారు.
తీరా ఎన్నికలు వచ్చేసరికి అలాంటి చర్యలు ఏమి కనపడలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి దశ-దిశ చూపే నాయకుడు జగన్ మాత్రమేననే భావనతో వైసీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారన్నారు. వైసీపీకి 151 సీట్లు రావడం వెనుక వైసీపీ పట్ల అభిమానం ఉందని చెప్పడం కంటే… రాష్ట్రం మొత్తం ఒక వర్గం చేతుల్లోకి వెళ్లిపోతోందని ప్రజలు భయపడి వైసీపీకి ఓటేశారన్నారు.
ఇక ‘చంద్రబాబుని ఎవరైనా నమ్మితే అది చంద్రబాబు తప్పుకాదని… నమ్మినవారిదే తప్పని’ కొంతకాలం కిందట బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ తనకు చెప్పారని అది వాస్తవమేనని తెలియడానికి తనకు ఐదేళ్లు పట్టిందన్నారు.
చదవండి: నేడు మంత్రివర్గం తొలి భేటీ: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై చర్చ….








