
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో తొలి కరోనా మరణం నమోదైంది. ఇప్పటి వరకు కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాలు లేకపోవడం ఏపీ ప్రజలు కొంత ధీమాగా ఉన్నారు.
అయితే, ఇప్పుడు కరోనా కాటుకు ఒకరు బలయ్యారని తెలిసి జనంలో భయం మొదలైంది. ముఖ్యంగా విజయవాడ వాసుల్లో గుబులు మొదలైంది.
నగరానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి కరోనా కారణంగా మృతి చెందాడు. ఏపీలో ఇది తొలి మరణంగా రికార్డులకెక్కింది.
గత నెల 17న ఢిల్లీ నుంచి వచ్చిన కుమారుడి ద్వారా అతడికి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు.
దీంతో కుమారుడు, తండ్రితోపాటు వారిని కలిసిన 29 మందిని అధికారులు క్వారంటైన్కు తరలించారు. తాజాగా తండ్రి మరణించారు. దీంతో జిల్లా వాసుల్లో భయం నెలకొంది. ఆ వ్యక్తి నుంచి ఈ వైరస్ ఎంతమందికి సోకిందనే ఆందోళన నగర వాసుల్లో మొదలైంది.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ రోజు (శుక్రవారం)కి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరుకుంది. నేడు నెల్లూరులో 8, విశాఖలో 3, కడపలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది.








