అమరావతి: తీవ్ర తుఫానుగా మారిన ‘ఫొని’ ఒడిశాలోని పూరీ సమీపంలో తీరాన్ని తాకింది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఒడిశా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.
ఉదయం 11 సమయంలో తుఫాన్ పూర్తిగా తీరం దాటనుంది. తీరం దాటిన అనంతరం క్రమంగా బలహీనపడనుంది.
తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తుఫాన్ ఒడిశా వైపుకు వెళ్లడంతో శ్రీకాకుళంకు పెనుముప్పు తప్పింది. కానీ తీరం దాటాక భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఇక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈదురుగాలుల ధాటికి చెట్లు, స్తంభాలు నేలకొరిగాయి. కంచిలిలో గరిష్ఠంగా 10 సెం.మీ., సోంపేటలో 10 సెం.మీ. వర్షపాతం నమోదయిందని అధికారులు వెల్లడించారు. తుఫాన్ ఏపీ సరిహద్దు దాటటంతో శ్రీకాకుళం జిల్లాకు ముప్పుతప్పినట్లేనని తెలిపారు.
ఇక ఒడిశాలో 20 సెం.మీ. మేర వర్షం కురిసే అవకాశముందని..దాని వలన వరదలు ముంచెత్తే ప్రమాదముందని భావిస్తున్నారు. తుఫాన్ గమనాన్ని ఆర్టీజీఎస్ పరిశీలిస్తోంది. దానికి అనుగుణంగా తుఫాన్ బాధిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది.
చదవండి: ఏపీకి తుపాన్ల శాపం! వరుణ దేవా.. మా రాష్ట్రంపై ఎందుకీ పగ?