- Advertisement -

విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబ సభ్యులను శుక్రవారం సీఎం చంద్రబాబు పరామర్శించారు. అమెరికా నుంచి స్వదేశానికి చేరుకున్న వెంటనే ఆయన విజయవాడ నుంచి హెలికాప్టర్లో నేరుగా పాడేరుకు బయలుదేరి వెళ్లారు. కిడారి కుటుంబ సభ్యులను కలుసుకుని.. అన్ని విధాలా అండగా ఉంటాననీ, భయపడవద్దని వారికి ధైర్యం చెప్పారు. సర్వేశ్వరరావు కుమారులు సందీప్, శ్రవణ్లను ఒదార్చిన చంద్రబాబు ఓ దశలో తాను కూడా కంటతడి పెట్టారు.
‘‘నేను అండగా ఉంటా.. భయపడవద్దు’’…
‘మీ కుటుంబానికి అండగా నేనుంటా..’ అంటూ వారికి ధైర్యం చెప్పారు. ఆ తరువాత చంద్రబాబు మాట్లాడుతూ.. కిడారి ఎప్పుడూ అభివృద్ధి గురించే మాట్లాడేవాడని, ఆయన ఇద్దరు కుమారులను తాను ఇప్పుడే చూస్తున్నానని అన్నారు. అంకిత భావం ఉన్న నేతను కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
ప్రజా ప్రతినిధులను చంపితే ప్రజలకే నష్టమనీ, దీనివల్ల ఎలాంటి లాభం జరగదని, ప్రజా సేవకు వెళ్లిన కిడారిని మావోయిస్టులు పొట్టనబెట్టుకోవడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిడారి సర్వేశ్వరరావు అనుచరులు, టీడీపీ కార్యకర్తలు… జోహోర్.. కిడారి సర్వేశ్వరావు జోహార్, అమర్ రహే కిడారి సర్వేశ్వరరావు అమర్ రహే.. అంటూ ఆ ప్రాంతమంతా దద్ధరిల్లేలా నినాదాలు చేశారు
రూ.కోటి నగదు సాయం, గ్రూప్-1 ఉద్యోగం…
కిడారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.కోటి నగదు సాయంతో పాటు ఓ కుమారుడికి గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే పార్టీ తరఫున రూ.15 లక్షల సాయం అందిస్తామన్నారు. కిడారి కుటుంబానికి సొంత ఇల్లు లేదనీ, ఇంకా ప్రభుత్వ క్వార్టర్లలోనే ఉన్నారని, ఆయన కుటుంబానికి వైజాగ్లో ఇంటి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
పాడేరు, అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పాడేరు టికెట్ను ఎవరికి కేటాయిస్తారని మీడియా ప్రశ్నించగా.. ఇప్పుడు దానిపై మాట్లాడటం సరైనది కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం అరకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సివేరి సోమ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరారు.
- Advertisement -