
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తప్పులోకాలేశారు. ప్రతిపక్షాలపై కురిపించిన విమర్శలను సొంత పార్టీ అభ్యర్థిపైనే ఉపయోగించారు. నెల్లూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. టీడీపీ ఎన్నికల సన్నాహక సభలో భాగంగా చంద్రబాబు నాయుడు సభావేదికపై నెల్లూరు జిల్లాకు చెందిన ఆరుగురు అభ్యర్థులను పరిచయం చేశారు. నెల్లూరు నగర అభ్యర్థి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ అభ్యర్థి అబ్దుల్ అజీజ్, సర్వేపల్లి అభ్యర్థి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కావలి అసెంబ్లీ అభ్యర్థి కాటం రెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డితోపాటూ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి బీద మస్తాన్ రావు, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మిలను పరిచయం చేశారు.
సొంతపార్టీ అభ్యర్థిని పొగుడుతూనే విమర్శలు…
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు బీద మస్తాన్ రావును సభకు పరిచయం చేస్తూ ..’నీతి నిజాయితీ ఉండే వ్యక్తి మస్తాన్ రావుగారూ అవునా కాదా.. పనులు చేయించుకొని పారిపోయిన వ్యక్తి .. ఏం తమ్ముళ్లూ .. ఊసరవెళ్లి రాజకీయాలు చేసే వ్యక్తి .. నికార్సయిన వ్యక్తి మస్తాన్ రావుగారూ’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలతో అక్కడ్నున్నవారంతా నిశ్చేష్టులయ్యారు.
సొంతపార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థినే ఊసరవెళ్లి రాజకీయాలు చేసే వ్యక్తి అంటూ చంద్రబాబు నోరుజారడంతో అక్కడున్నవారంతా అవాక్కాయ్యారు. ఓ వైపు పొగుడుతూనే.. మరోవైపు తిట్లను కూడా కలపడంపై షాకయ్యారు.
ఇది ఇలావుంటే, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అంతేగా అంతేగా, మీ గురించి ఇన్ని రోజులకు నిజాలు చెప్పారు అంటూ నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. ఇక మరికొందరు చంద్రబాబు సీనియర్ లోకేష్ అయ్యారంటూ సెటైర్లు వేయడం గమనార్హం.








