
అమరావతి: ఎన్నికలు ముగిసి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ బీజేపీ హయాంలోని ఎన్డీయేకి పట్టం కట్టినా…ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం బీజేపీయేతర కూటమిని ఏర్పాటు చేసే పనిని మాత్రం ఆపట్లేదు.
ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించేలా ఎగ్జిట్ పోల్స్ లేవంటూ కొట్టిపారేసిన చంద్రబాబు… కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు.
ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్ళి వరుసగా విపక్ష నేతలతో భేటీ అయిన బాబు… ఈరోజు సాయంత్రం మరోసారి ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, ఇతర నేతలను కలవనున్నారని సమాచారం. తాజా పరిణామాలపైనా ఢిల్లీ వేదికగా ఆయా పార్టీ పెద్దలతో చర్చించనున్నారు.
చదవండి: ఎగ్జిట్ పోల్స్ ఒక గేమ్ ప్లాన్! మండిపడ్డ మమత బెనర్జీ!
ఎన్డీయే దూకుడు…
మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ మళ్ళీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని చెప్పడంతో…బీజేపీ పక్షాల్లో జోష్ పెరిగింది. దీంతో ఫలితాల వెల్లడికి ముందే సమావేశం కావాలని ఎన్డీయే పక్షాలు సమావేశం కావాలని నిర్ణయించాయి.
ఈ నెల 21న నిర్వహించనున్న ఈ భేటీకి బీజేపీ, దాని మిత్ర పక్షాలు హాజరై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నాయి.








