
విజయవాడ: గత నెల 23వ తేదీన వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో విశాఖపట్నం నుంచి టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేసిన బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం అధినేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మనుమడు భరత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.
తన సమీప వైసీపీ అభ్యర్ది ఎంవివి సత్యనారాయణ చేతిలో భరత్ కేవలం 4414 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఇక్కడ జనసేన అభ్యర్ధి సిబిఐ మాజీ జేడీ లక్ష్మినారాయణకి దాదాపు 2 లక్షల ఓట్లపైనే ఓట్లు వచ్చాయి. చాలామంది అసెంబ్లీకి టీడీపీకి ఓటు వేసిన వారు పార్లమెంట్ లో జనసేనకి క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో వైసీపీ అభ్యర్ధికి మెజార్టీ వచ్చి విజయం సాధించారు.
అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఇంతవరకూ మీడియా ముందుకు రాని భరత్ మొదటిసారి తన ఓటమిపై స్పందించారు. ఈరోజు విజయవాడలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న భరత్ మీడియాతో మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో ఓటమి ద్వారా గుణపాఠం నేర్చుకుంటామని చెప్పుకొచ్చారు.
క్రాస్ ఓటింగ్ కారణంగానే ఓడిపోయామని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నిలదీస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలు విశ్లేషించుకుంటామన్నారు.








