
అమరావతి: ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ తన పదవికి రాజీనామా చేశారు. సచివాలయంలోని సీఎం కార్యాలయంలో రాజీనామా లేఖను ఆయన అందజేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరునెలల్లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నికవ్వాలి. కానీ కొన్ని కారణాలతో అలా కుదరకపోవడం తో శ్రవణ్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇకపోతే తన రాజీనామా లేఖను సమర్పించడానికి ముందుఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకుని మంత్రి లోకేశ్తో చర్చించారు. అనంతరం సచివాలయానికి వెళ్లిన శ్రవణ్, సీఎం కార్యాలయ అధికారులకు రాజీనామా లేఖను సమర్పించారు.
రాజీనామా లేఖ అందజేసిన అనంతరం, శ్రవణ్ మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ నిబంధనలకు లోబడి తన పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. మంత్రిగా ఆరు నెలల పదవీకాలంలో మూడు నెలల కాలం ఎన్నికల కోడ్ కే పోయిందని చెప్పాడు.
సీఎం చంద్రబాబు తనను వారి కుటుంబసభ్యుడిగా చూసుకున్నారని ప్రశంసించారు. తన శాఖ ద్వారా గిరజనులకు ఫుడ్ బాస్కెట్ పథకం తీసుకురావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన అరకు స్థానం నుంచి ఆయన పోటీ చేశారు.








