
అమరావతి: ఏపీలో ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్లు ఫుల్ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో కొత్త కొత్త రకాలుగా బెట్టింగ్లు వేస్తున్నారు. ఈ క్రమంలో పులివెందులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెజారిటీ, కుప్పంలో నారా చంద్రబాబునాయుడు మెజారిటీల మీద జోరుగా పందాలు జరుగుతున్నాయి.
సీఎం చంద్రబాబుకు మెజారిటీ ఎక్కువ వస్తుందా లేదా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మెజారిటీ ఎక్కువ వస్తుందా అనే పందాలతో పాటు 2014లో వచ్చిన మెజారిటీని ఇద్దరూ బ్రేక్ చేస్తారా లేదా అని జోరుగా పందాలు కాస్తున్నారు. ఏపీలో ఈసారి రసవత్తకరంగా ఎన్నికలుజరగడం తో మెజార్టీపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా పులివెందులతో పాత రికార్డులన్నీ జగన్ బద్ధలు కొడతారని వైసీపీ నేతలు చెబుతుంటే, ట్రెండ్ మారింది జగన్ పాత రికార్డులు బ్రేక్ చేసే పరిస్థితి లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. 2014వ సంవత్సరంలో పులివెందుల నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 75,243 ఓట్ల మెజారిటీ వచ్చింది.
జగన్ మోహన్ రెడ్డికి 1,24,576 ఓట్లు వచ్చాయి. ఆయన మీద పోటీ చేసిన టీడీపీ నేత సతీష్ రెడ్డికి కేవలం 49,333 ఓట్లు పోలయ్యాయి. ఈసారి కూడా ఆ ఇద్దరే మళ్లీ బరిలో దిగారు. మే 23న వచ్చే ఫలితాల్లో జగన్ మోహన్ రెడ్డి కనీసం 80వేల ఓట్ల తేడాతో గెలుస్తారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక చంద్రబాబు విషయానికి వస్తే, 2014లో టీడీపీ అధినేతకు 1,02,952 ఓట్లు వచ్చాయి. చంద్రబాబు ప్రత్యర్థి, వైసీపీ నేత కె.చంద్రమౌళికి 55,832 ఓట్లు వచ్చాయి. 47,121 ఓట్ల తేడాతో చంద్రబాబు విజయం సాధించారు. ఇప్పుడు కూడా ఆ ఇద్దరే బరిలో నిలిచారు. ఈ సారి చంద్రబాబుకు కనీసం 50వేల మెజారిటీ వస్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.








