
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై సమీక్ష జరిపిన ఆయన….గత టీడీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు థర్డ్పార్టీ విచారణ చేపడతామని ప్రకటించారు.
అయితే ప్రాజెక్టుల వారీగా అంచనాలను విపరీతంగా పెంచి చేపట్టిన పనులపై విచారణ జరుగుతుందని, అవినీతిని అరికట్టేందుకు తీసుకునే చర్యలకు అధికారులు సహకరించాలని ఆయన కోరారు.
అయితే ‘థర్డ్ పార్టీ విచారణ నివేదిక రాకముందే సంబంధిత విభాగాల ఇంజనీర్లు వాస్తవ లెక్కలను చెప్పాలని, గతంలో జరిగిన అక్రమాలపై నోరు విప్పాలని, తన దృష్టికి తీసుకొస్తే ఇంజినీర్లని సన్మానిస్తానని చెప్పారు.
ఇక గత టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టుల్లో అక్రమాలకి పాల్పడిన వారికి ఇబ్బందులు తప్పేలా లేదు. ఇప్పుడు థర్డ్ పార్టీ విచారణలో వారి అక్రమాలు బయటపడితే కఠిన చర్యలు తీసుకునేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారు.
భయపడేది లేదు: టీడీపీ
ఇదిలా ఉంటే చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల్లో ఎటువంటి అవినీతి జరగలేదని, భయపడాల్సిన అవసరం తమకు లేదని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి, సంక్షేమం జరిగాయని , ఒకవేళ చంద్రబాబు హయాంలో ఏవైనా లోటుపాట్లు జరిగి ఉంటే, అలాంటివి జరగకుండా జగన్ ప్రభుత్వం చూసుకోవాలని సూచించారు.
చదవండి: సీఎం జగన్ ఇంటి ముందు ఏఎన్ఎం, డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన!








