
అమరావతి: ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేస్తుందని, తమ పనితీరుపై అనుమానాలు అక్కర్లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ వద్ద లభ్యమైన ఓటరు జాబితా అందరికీ అందుబాటులో ఉండేదేనని పబ్లిక్ డొమైన్లో ఉండే వివరాలు ఎవరైనా తీసుకొనే వీలుందని వ్యాఖ్యానించారు.
డేటా వివాదంపై కొనసాగుతున్న రాజకీయ ఆరోపణలతో తమకు సంబంధం లేదన్నారు. ఎన్నికల ఉద్యోగులు తప్పుచేసినా క్రిమినల్ చర్యలతో పాటు సస్పెండ్ చేస్తున్నామని వివరించారు.
ఓటరు జాబితాలో ఆధార్, బ్యాంకు ఖాతా లింకు సమాచారం ఉండదని, ఇతర సంక్షేమ పథకాల సమాచారం కూడా ఏదీ ఉండదని ద్వివేది తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 45వేల మంది బూత్ లెవెల్ అధికారులు ఉన్నారని, వారిలో ఎవరోఒకరు పొరపాటు చేసే అవకాశం ఉందన్నారు.
ఫిర్యాదులు తగ్గాయి..
ఓట్లు తొలగించాలంటూ వారం రోజుల క్రితం వరకు రోజుకు లక్ష దరఖాస్తులు వచ్చేవని, ఇప్పుడు గణనీయంగా తగ్గాయని ద్వివేది తెలిపారు. ఓట్లు తొలగించాలంటూ తప్పుడు దరఖాస్తులు పెట్టిన వారిపై ఇప్పటివరకు వందకు పైగా కేసులు నమోదైనట్టు ద్వివేది తెలిపారు. అన్ని వివరాలు పరిశీలించాకే ఓట్లు తొలగిస్తామని పేర్కొన్నారు. ఐటీ గ్రిడ్ సంస్థకు ఓటర్ల డేటా ఎక్కడి నుంచి వచ్చిందో పోలీసులు చెప్పాలని ఆయన అన్నారు.








