
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంది. నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఐకానిక్ భవనాల బాహ్య డిజైన్లకు తుది మెరుగులు దిద్దేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం లండన్ చేరుకుంది.
శాసనసభ, హైకోర్టు, సచివాలయ టవర్లకు సంబంధించిన తుది రూపురేఖలను ఖరారు చేయడమే లక్ష్యంగా అంతర్జాతీయ ఆర్కిటెక్టులు, నిర్మాణ రంగానికి చెందిన ప్రముఖ కన్సల్టెన్సీలతో ఈ బృందం విస్తృత చర్చలు జరపనుంది.
ఈ పర్యటనలో భాగంగా డిజైనింగ్ బాధ్యతలు చేపట్టిన నార్మన్ అండ్ ఫోస్టర్స్, హఫీజ్ కాంట్రాక్టర్స్, బ్యూరో హాపోల్డ్, ఎల్ అండ్ టీ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా అమరావతికే తలమానికగా నిలిచే అసెంబ్లీ భవనం పైభాగంలో ఎత్తైన టవర్ నిర్మాణ శైలిపై ప్రధానంగా దృష్టి సారించారు.
ఈ టవర్ నుంచి రాజధాని నగరం మొత్తాన్ని తిలకించేలా, ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
మంత్రి నారాయణతో పాటు సీఆర్డీయే కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్ అభిషేక్ కుమార్, పలువురు చీఫ్ ఇంజినీర్లు ఈ పర్యటనలో భాగస్వాములయ్యారు.








