
గుంటూరు: మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అవమానం జరిగింది. ఆర్కేకు సమాచారం లేకుండా వైసీపీలో మంగళగిరి టీడీపీ, బీజేపీ నేతలు చేరారు. దీంతో ఆర్కే అనుచరులు తీవ్ర అవమానంగా భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీ నుంచి వైదొలగాలని ఒత్తిడితో రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్కేకు టికెట్ దక్కకపోవచ్చంటూ కొంతకాలంగా జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
పార్టీలో అవమానమే కారణమా…
అయితే తాను తిరిగి పోటీ చేయనని, అంత ఆర్థిక స్థోమత లేదని సన్నిహితుల వద్ద రామకృష్ణారెడ్డి ప్రస్తావించినట్లు సమాచారం. పార్టీ అధినేతను కలిసి వేరేవారికి అవకాశం ఇవ్వాలని చెప్పడమే కాకుండా కొందరి పేర్లను ఆయన సూచించినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ కూడా అక్కడి నుంచి ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుందనే కసరత్తు చేస్తున్నారు. రామకృష్ణారెడ్డి సూచించిన పేర్లు కాకుండా వేరే ఒక పద్మశాలీ మహిళ పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు భోగట్టా.
2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి గంజి చిరంజీవిపై కేవలం 12 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి గెలుపొందారు. అయితే ఈ సారి ఎలాగైనా సరే నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేయాలని అధిష్టానం భావిస్తోంది. మరోవైపు ఈసారి భారీ మెజార్టీతో గెలవాలని ఆర్కే గత మూడేళ్లుగా జనాల్లో తిరుగుతూనే ఉన్నారు. పైగా రాజన్న క్యాంటిన్, రాజన్న కూరగాయల మార్కెట్ అంటూ ప్రజలకు బాగా దగ్గరవుతున్నారు.
మరోవైపు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సారి మంగళగిరి టికెట్ను మాజీ మంత్రి హనుమంతరావు, పోతినేని శ్రీనివాసరావు, ప్రస్తుతం ఇంచార్జ్గా ఉన్న గంజి చిరంజీవి ఆశిస్తున్నట్లు అభిప్రాయ సేకరణలో తేలింది. వీరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనేదానిపై నిశితంగా మంగళవారం జరిగిన సమావేశంలో చంద్రబాబు చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే గంజి చిరంజీవికే టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
చదవండి: చంద్రబాబుకు బిగ్ షాక్! వైసీపీలో చేరిన ఎన్టీఆర్ మామ!? జగన్ను ముఖ్యమంత్రిగా చూడటమే లక్ష్యం.








