

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సహా అన్ని విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన టీడీపీ ఎంపీలకు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ షాకిచ్చారు. తమ తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమె కొరడా ఝుళిపించారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ 12 మంది టీడీపీ సభ్యులను నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేస్తూ గురువారం ఆదేశాలు జారీచేశారు.
సస్పెన్షన్ వేటుకు గురైన వారిలో.. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, మురళీ మోహన్, రామ్మోహన్ నాయుడు, తోట నరసింహం, బుట్టా రేణుక, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాగంటి బాబు, శ్రీరామ్ మాల్యాద్రి, అశోక్ గజపతి రాజు, కొనకళ్ల నారాయణ, జేసీ దివాకర్ రెడ్డిపై ఉన్నారు.
సస్పెన్షన్ నేపథ్యంలో వారంతా లోక్సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరగా అందుకు టీడీపీ ఎంపీలు నిరాకరించారు. లోక్సభలోనే తమ ఆందోళనను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. మరోవైపు టీడీపీ ఎంపీలతోపాటుగా 9 మంది అన్నాడీఎంకే సభ్యులను సైతం స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం లోక్సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
స్పీకర్ సస్పెండ్ చేసినా…
సభ్యులందరూ బయటకు వచ్చినప్పటికీ టీడీపీ ఎంపీలు మాత్రం లోక్సభలోనే తమ నిరసన పర్వాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు మధ్యాహ్నం 2 గంటలకు రఫెల్ ఒప్పందంపై లోక్సభలో చర్చ ఉంది. మరి టీడీపీ ఎంపీల ఆందోళన నేపథ్యంలో దానిపై ఆ చర్చపై కొంత ఉత్కంఠ నెలకొంది.








