
విశాఖపట్నం: నగరంలోని ఆర్ ఆర్ వెంకటాపురం సమీపంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి లీకైన విషవాయువు పీల్చి మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు.
గురువారం మధ్యాహ్నం కేజీహెచ్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
దుర్ఘటనపై విచారణ కమిటీ…
ప్రమాదంపై కమిటీని నియమించి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కమిటీలో పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి సెక్రటరీ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్సీ, విశాఖ నగర సీపీలు ఉంటారన్నారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా కమిటీని ఆదేశించినట్లు చెప్పారు.
మల్టీనేషనల్ కంపెనీ అయిన ఎల్జీ ప్రమాణాలు పాటించే సంస్థే, అయినప్పటికీ విచారణ అనంతరం కమిటీ అందజేసే నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఫ్యాక్టరీ తరలింపునకు కూడా ఏమాత్రం వెనకాడబోమని సీఎం హామీ ఇచ్చారు.
‘‘అలారం ఎందుకు మోగలేదు?’’
పరిశ్రమ నుంచి విషవాయువు బయటికి లీకైతే అలారం మోగాలి కదా? ఎందుకు మోగలేదు? ఈ ఆలోచన తనకూ వచ్చిందని సీఎం జగన్ పేర్కొన్నారు. అయితే ఘటన జరిగిన వెంటనే అధికారులు స్పందించారని, వారికి తన అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు.
తెల్లవారుజామున 4.30 గంటలకే కలెక్టర్ ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు తీసుకున్నారని తెలిపారు. 5 గంటలకల్లా అంబులెన్స్లు వచ్చాయని, 340 మంది స్థానికులను ఆసుపత్రికి తరలించారని జగన్ తెలిపారు.
దురదృష్టవశాత్తు 9 మంది మరణించారని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని వివరించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఎల్జీ కంపెనీ ఉద్యోగం ఇచ్చేలా చూస్తామన్నారు.
ఎక్స్గ్రేషియా ఇలా…
వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే రెండు, మూడు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందేవారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు.
ఇక విషవాయువు కారణంగా స్వల్ప అస్వస్థతకు గురై చికిత్స తీసుకుంటున్న వారికి రూ.25 వేలు, గ్యాస్ ప్రభావిత గ్రామాల ప్రజలకు రూ.10 చొప్పున పరిహారం అందజేస్తామన్నారు.
చీఫ్ సెక్రటరీ, ఇన్ఛార్జి మంత్రి ఇక్కడే ఉండి…
చీఫ్ సెక్రటరీ నీలం సహాని, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కన్నబాబు, ఉత్తరాంధ్రకు చెందిన ఇతర మంత్రులు, నాయకులు, అధికారులు రెండ్రోజులపాటు ఇక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని సీఎం జగన్ చెప్పారు.
రసాయన వాయువు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్లే ప్రమాదం వాటిల్లిందని, ఈ ఘటనలో మరణించిన జంతువులకు కూడా ఒక్కోదానికి రూ.25 వేల చొప్పున పరిహారం ఇస్తామని ఆయన వివరించారు.
సంబంధిత వార్తలు
చదవండి: విశాఖలో ఎల్జీ పాలిమర్స్ నుంచి కెమికల్ గ్యాస్ లీక్.. ముగ్గురి మృతి.. వందలాదిమందికి అస్వస్థత
చదవండి: విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 8కి పెరిగిన మృతుల సంఖ్య.. మరికాసేపట్లో విశాఖకు జగన్
చదవండి: విశాఖ గ్యాస్ లీక్ ఘటన: సీఎం జగన్ తీవ్ర ఆవేదన, సహాయక చర్యల వేగవంతానికి ఉన్నతాధికారులకు ఆదేశాలు…
చదవండి: విశాఖ గ్యాస్ లీకేజి: చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. విశాఖ వెళ్లేందుకు అనుమతి కోసం కేంద్రానికి విజ్ఞప్తి…
చదవండి: విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: స్పందించిన ప్రధాని మోడీ, సీఎం జగన్కు ఫోన్…
చదవండి: విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: జనసేనాని దిగ్భ్రాంతి, హృదయ విదారకం అంటూ…
చదవండి: విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే…
చదవండి: గ్యాస్ లీకేజి దుర్ఘటన: విశాఖ చేరుకున్న సీఎం జగన్, కేజీహెచ్లో బాధితులకు పరామర్శ…








