
అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం సౌర, పవన్ విద్యుత్ యూనిట్ ధర మార్కెట్ లో రూ.3-రూ.3.50 ఉండగా, రూ.6కు కొనుగోలు చేసిందని సీఎం జగన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను(పీపీఏ)ను సమీక్షిస్తామని, అవసరమైతే రద్దు చేస్తామని జగన్ ప్రకటించారు.
అయితే దీనివల్ల పెట్టుబడిదారుల్లో భయం నెలకొంటుందనీ, సమీక్షలు చేపట్టి పీపీఏలను రద్దుచేయడం మంచిది కాదని తాజాగా కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు.
కానీ ఈ విషయంలో సీఎం జగన్ వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది. దీన్ని సీరియస్గా తీసుకున్న ఆయన…ఇటీవల ఏపీ పర్యటనకి వచ్చిన ప్రధాని మోడీ దృష్టికి పీపీఏల వ్యవహారాన్ని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఒప్పందాల్లో ‘తప్పు జరిగినప్పుడు సమీక్షించడంతో తప్పు ఏముంది?’ అని మోడీ చెప్పినట్లు సమాచారం.
ఇక పీపీఏల సమీక్షల విషయంలో ప్రధాని మద్ధతు దొరకడంతో సీఎం జగన్…త్వరలోనే వాటిపై సమీక్షా జరిపి తగిన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.








