
విశాఖపట్నం: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ(ఎస్టీ) నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన పుష్ప శ్రీవాణికి షాక్ తగిలేలా ఉంది. ఎవరు ఊహించని విధంగా జగన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న పుష్ప శ్రీవాణి….డిప్యూటీ సీఎం పదవిని కూడా చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.
అయితే ఆమె ఎస్టీ కోటాలో మంత్రి పదవి దక్కించుకుంది. కానీ ఆమె అసలు ఎస్టీనే కాదని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స ఆరోపించారు. ఆమె కులానికి సంబంధించిన కేసు కోర్టు విచారణలో ఉందని, అటువంటప్పుడు ఆమెను ఎస్టీగా పరిగణిస్తూ, డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖలను ఎలా ఇస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇక పుష్ప శ్రీవాణి సోదరి రామతులసి ఎస్టీ కాదని గతంలో అధికారులు ధ్రువీకరించారని, ఈ నేపథ్యంలోనే ఆమె తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. అయితే సోదరి రామతులసి ఎస్టీ కానప్పుడు పుష్పశ్రీవాణి ఎస్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు.








