హైదరాబాద్: తెలంగాణలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. ఇక ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరు.. తరువాత టీఆర్ఎస్ తీర్ధం కూడా పుచ్చుకున్నారు.
అలాగే ఆ తర్వాత జరిగిన పంచాయితీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. ఇక ఇప్పుడు లోక్సభ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల ఫలితాలే వెలువడాల్సి ఉంది. అసలు విషయం ఏమిటంటే.. ఈ ఎన్నికలన్నీ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగాయి.
దీంతో కేవలం నాయకత్వం లోపం వల్లే కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయని పార్టీలో కొందరు నాయకులు భావిస్తున్నారు. అందుకే చాలామంది నేతలు పీసీసీ అధ్యక్ష పదవి కొత్తవారికి ఇవ్వాలని డిమాండ్ కూడా బహిరంగంగానే చేస్తున్నారు.
చదవండి: మోడీ మబ్బు మాటలపై ప్రియాంకా సెటైర్లు…
ఈ క్రమంలోనే గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు మధ్య నేడు జరిగిన ఆసక్తికర సంభాషణ హాట్ టాపిక్గా మారింది. ఈ సంభాషణ నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో టీపీసీసీ పదవికి ఉత్తమ్ రాజీనామా చేస్తారని చర్చ జోరుగా జరుగుతోంది.
అసలేం జరిగిందంటే … గాంధీభవన్లో ఉత్తమ్, శ్రీధర్బాబు సరదాగా మాట్లాడుకున్నారు. ఇకపై బీఫామ్లు ఇచ్చేది నువ్వే కదా అని శ్రీధర్బాబుతో ఉత్తమ్ అంటే, పై నుంచి బీ ఫామ్లు పంపేది నువ్వే కదా అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డితో శ్రీధర్ బాబు సరదాగా సంభాషించుకున్నారు.
దీని ప్రకారం చూసుకుంటే ఉత్తమ్కు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవి, శ్రీధర్ బాబుకి పీసీసీ పదవి ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.
చదవండి: విశాఖ బీచ్లో అక్కినేని, దాసరి, హరికృష్ణ విగ్రహాలు తొలగింపు…ఉద్రిక్తత