న్యూఢిల్లీ/హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ మంగళవారం రాత్రి భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తొలుత ఆమెతో భేటీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కూడా అరుణ ఫొన్లో మాట్లాడినట్లు తెలిసింది.
మహబూబ్నగర్ ఎంపీగా..
ఈ నేపథ్యంలో డీకే అరుణ కాంగ్రెస్ పార్టీని వీడి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. కాగా, మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె బరిలో దిగనున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా బీజేపీ నేతలు అరుణతో చర్చలు జరుపుతున్నారు.
మంగళవారం నాటికిః ఇవి కొలిక్కివచ్చాయి. రాష్ట్రాల వారీగా లోక్సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మంగళవారం రాత్రి ఢిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణ నుంచి డీకే అరుణ బీజేపీలో చేరుతున్నట్లు అమిత్షా నేతలకు చెప్పారు.
ఈ క్రమంలో అమిత్షా, కేంద్రమంత్రి నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, మురళీధర్రావుల సమక్షంలో మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంటకు డీకే అరుణ బీజేపీలో చేరారు. వాస్తవంగా బీజేపీ తెలంగాణ లోక్సభ అభ్యర్థుల జాబితా మంగళవారం సాయంత్రమేవెలువడాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇది వాయిదా పడింది.
కాగా, గత కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్లో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల అరుణ అసంతృప్తితో ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ల అంశంలో తమ వర్గానికి అన్యాయం జరిగిందని, లోక్సభ అభ్యర్థిత్వాల అంశంలోనూ తన అభిప్రాయాలను పట్టించుకోలేదని సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు తెలిసింది.