తెలంగాణలో కరోనా కేసులు మరోసారి భారీ సంఖ్యలో నమోదయ్యాయి. ఈ రోజు ఒక్కరోజే 237 కేసులు నమోదు అయ్యాయి.
నిన్నటితో పోల్చుకుంటే ఇవి తక్కువే అయిన్పటికీ వరుసగా రెండు రోజులు 200కు పైగా నమోదవడంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
తాజా కేసుల సంఖ్య మాత్రమే కాకుండా మరణాల సంఖ్య కూడా నిన్నటితో పోల్చుకుంటే చాలా వరకు తగ్గింది.
గత కొన్ని రోజులుగా మరణాలను నియంత్రించడంలో మాత్రం ప్రభుత్వం సఫలం అయిందనే చెప్పాలి.
శుక్రవారం 10 మరణాలు రాష్ట్రంలో నమోదుకాగా, శనివారం 8 మరణాలు నమోదయ్యాయి. కాగా నేడు కేవలం 3 మరణాలు మాత్రమే సంభవించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇక ఎప్పటిలాగే జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల్లో 195 కేసులు ఇక్కడే నమోదు అయ్యాయి.
మిగిలిన కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లోనే నమోదు అయ్యాయి.
నగరం సరిహద్దు జిల్లాలైన మేడ్చెల్లో 10, రంగారెడ్డి 8, సంగారెడ్డి 5 కేసులు నమోదు అయ్యాయి. మొత్తంగా తెలంగాణలోని 16 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి.
ఈరోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు 4974కు చేరుకుంది.
ఈరోజు మరణించిన ముగ్గురితో కలిపి రాష్ట్రంలో 185 మరణాలు కరోనా వల్ల సంభవించాయి. ఇక 2377 మంది కరోనా నుంచి కోలుకున్నారు.