ఇంతకన్నాఎక్కువ ఇవ్వలేం: మహాకూటమి సీట్ల కేటాయింపుపై చేతులెత్తేసిన కాంగ్రెస్!

Mahakutami3
- Advertisement -

Mahakutami3

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలలో భాగంగా ఏర్పడిన మహాకూటమిలో ఉన్న టీజేఎస్, సీపీఐలకు వారు కోరినన్ని సీట్లు ఇచ్చే అవకాశాలు లేవని కాంగ్రెస్ పార్టీ కుండబద్దలు కొట్టింది.

టీజేఎస్ పార్టీ 10 నుంచి 12 స్థానాలు, సీపీఐ పార్టీ 5 స్థానాలను డిమాండ్ చేస్తుండగా, టీజేఎస్‌కు 8 స్థానాలు, సీపీఐకి 3 స్థానాలను మాత్రమే ఇవ్వగలమని కాంగ్రెస్  తేల్చి చెప్పింది. ఇంక వారు మహాకూటమిలో ఉండాలా లేక బయటకు వెళ్లాలా అన్న నిర్ణయం ఆ పార్టీ నేతల చేతుల్లో ఉంది , ఈ విషయంలో తాము ఇంతకన్నా వదులుకునేది లేదని కాంగ్రెన్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

నేతల మధ్య కీలక చర్చలు…

ఈ  నేపథ్యంలో సోమవారం ఓ రహస్య ప్రదేశంలో మహాకూటమిలోని పార్టీల నేతల మధ్య కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో పొత్తులపై అన్ని పార్టీల నేతలు ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు సీపీఐ తమకు కాంగ్రెస్ ఇస్తామన్న సీట్లతో సర్దుకుపోయేలా కనిపించడం లేదు. అలాగే టీజేఎస్ సైతం తమకు అధిక సీట్లు కావాల్సిందేనని పట్టుబడుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా తొలుత 14 స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం తెలిపి, ఇప్పుడు మరో రెండు సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

సీపీఐ బయటకు వెళితే…

ఈ క్రమంలో కూటమిలో టీజేఎస్, సీపీఐ కొనసాగడంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ సీపీఐ మహాకూటమి నుంచి బయటకు వెళితే, టీజేఎస్‌కు 9 స్థానాలు , టీడీపీకి 15 స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

- Advertisement -