హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీ ప్రముఖులు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఇప్పటికే పలువురు జగన్మోమన్ రెడ్డితో భేటీ కాగా, తాజాగా గురువారం ప్రముఖ సినీ హీరో మంచు విష్ణు, ఆయన సతీమణి విరోనికా కలుసుకున్నారు.
లోటస్ పాండ్లో మంచు విష్ణు దంపతులు కాసేపు ఆయనతో ముచ్చటించారు. జగన్కి మంచు విష్ణు భార్య విరోనికా బంధువు కావడంతో మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ అధినేత జగన్ గుంటూరు సమీపంలోని తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన ఇంటిలో బుధవారం గృహప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ గృహ ప్రవేశానికి హాజరుకాలేకపోయిన విష్ణు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
Wishing nothing but the best for @ysjagan anna on his beautiful home. Wish you more energy, strength, and power from the almighty God to realise your dreams. pic.twitter.com/5HrQgwvLY6
— Vishnu Manchu (@iVishnuManchu) February 28, 2019
‘అందమైన ఇంటిలో జగన్ అన్నకు అంతా మంచే జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. మీ కలలను సాకారం చేసుకునే దిశగా ఆ దేవుడు మీకు మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’ అని విష్ణు వ్యాఖ్యానించారు.
రాజకీయంగా చర్చనీయం
అయితే, విష్ణు తండ్రి, సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని విష్ణు కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ప్రముఖ సినీనటుడు నాగార్జున కూడా జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే.