హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు టీఆర్ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఫోన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ధవళేశ్వరం బ్యారేజిపై జనసేన నిర్వహించిన కవాతు విజయవంతం కావడంపై పవన్ కల్యాణ్ ను అభినందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ మండిపడ్డారు. తానేదో నేరుగా వచ్చి 2014లో మంత్రి అయినట్టుగా కొందరు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని అంటూ.. 2006 నుంచి 2014 వరకు తెలంగాణ కోసం తాను పోరాడానని, అప్పుడు కాంగ్రెస్ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
అంతేకాదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు తాను అరెస్టయిన ఫొటోలను కూడా కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. తన ఉద్యమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నానని వ్యాఖ్యానించారు. అసలు ఉద్యమం సమయంలో కాంగ్రెస్ నేతలంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడంలో వారంతా బిజీగా ఉన్నారని విమర్శించారు.
ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నేపథ్యంలో.. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తోన్న పవన్ కల్యాణ్కు కేటీఆర్ ఫోన్ చేయడం, అభినందనలు తెలియజేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది.