
అమరావతి: గురువారం అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాను కూడా చంద్రబాబు మాదిరిగా ప్రతీకార రాజకీయాలు చేస్తే.. ఈ రోజున ఆయన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కూర్చొనే వారు కాదని, ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని జగన్ వ్యాఖ్యానించారు.
అంతేకాదు, తనతో టీడీపీ నేతలు టచ్లో ఉన్నారని, తాను డోర్ తెరిస్తే.. చాలామంది ఆ పార్టీ నాయకులు తమ పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నరని కూడా సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక జగన్ మాటలకు కొనసాగింపుగా 8 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్లో ఉన్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బాంబు పేల్చారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కూడా 2 నెలల నుంచి తమతో టచ్లో ఉన్నారని ఆయన వెల్లడించారు. 8 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు నేరుగా తనతోనే మాట్లాడుతున్నట్లు ప్రకటించారు.
అయితే వారంతా వచ్చే ఎన్నికల్లో టికెట్ అడుగుతున్నారని, నియోజకవర్గాల్లో పనులు చేయమని అడుగుతున్నారని తెలిపారు. ఇక తనతో టచ్లో ఉన్నవారిలో ఒకరు నియోజకవర్గంలో బలమైన ఎమ్మెల్యే.. కానీ వాళ్ల పేర్లు బయటపెట్టనని పేర్కొన్నారు.
వైసీపీకి టీడీపీ కౌంటర్…
వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే టచ్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల జాబితాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో తనతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని.. జగన్ చెబితే ఏమైందో మీకు తెలుసని కేశవ్ పేర్కొన్నారు.
ఇదంతా వైసీపీ ఆడుతున్న మైండ్గేమ్ మాత్రమేనన్నారు. గవర్నర్ ప్రసంగంలో సంక్షేమమే ఉంది తప్ప అభివృద్ధి కనిపించలేదన్నారు.








